Businessman Dies of Snake Bite at Moinabad : ఫాంహౌస్లో స్నేహితులతో కలిసి సరదాగా సమయం గడుపుతున్న సమయంలో అక్కడికి ఓ చిన్న పాము వచ్చింది. దాన్ని చేతితో పట్టుకొని సరదాగా అందరినీ భయపెట్టించే ప్రయత్నం చేసిన వ్యక్తిని అది కాటు వేసింది. దీంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్లోని రాజేంద్రనగర్ ఖాద్రీహిల్స్కు చెందిన నవాబ్ సయ్యద్ ఖుమైజ్ మొహిద్దీన్ హుస్సైనీ (30) వ్యాపారవేత్త. ఈ నెల 17న రాత్రి స్నేహితులతో కలిసి మొయినాబాద్లోని తన ఫాంహౌస్కు వెళ్లారు. అయితే తెల్లవారుజామున 3 గంటల సమయంలో అక్కడికి ఓ చిన్న కట్ల పాము వచ్చింది.మొహిద్దీన్ దానిని చేతిలో పట్టుకొని స్నేహితులను భయపెట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే ఆ పాము ఆయన కుడిచేతి బొటన వేలిని నోటితో గట్టిగా పట్టుకుంది. స్నేహితులు కరుస్తోందని చెప్పడంతో దాన్ని మరో చేతితో వదిలించుకున్నారు. ఆసుపత్రికి వెళదామని ఫ్రెండ్స్ చెబుతున్నా వినలేదు. తనకు ఏమీ కాదంటూ వారించాడు. గంట తర్వాత ఆయన శరీరంలో మార్పులు కనిపించడంతో స్నేహితులు మెహిదీపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఇంజక్షన్ వేశారు. మరో రెండు గంటల్లో పరిస్థితి విషమించడంతో ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడికి చేరుకున్న కాసేపటికే మొహిద్దీన్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Comments