Thirukalyana Brahmothsavam At Bhadrachalam : ఈ ఏడాది మార్చి 19న భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. దాంట్లో భాగంగానే ఆరోజు నుంచి స్వామివారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. వారానికిపైగా జరిగిన ఈ బ్రహ్మోత్సవాలు రేపటితో ముగియనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ సిబ్బంది ఈరోజు సీతారాములకు వసంతోత్సవ వేడుకను ఘనంగా చేశారు. ప్రధాన ఆలయంలోని సీతారాములను బేడా మండపానికి తీసుకువచ్చారు. ఆ తర్వాత వసంతాన్ని తయారుచేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ కోసం తయారుచేసిన వసంతాన్ని ముందుగా ప్రధాన ఆలయంలోని సీతారాములపై అలాగే ఉపాలయాల్లోని దేవత మూర్తులపై చల్లారు. మిగతా వసంతాన్ని భక్తులపై చల్లారు. ఈ వేడుక సందర్భంగా సీతారాములను సూర్యప్రభ వాహనంపై తిరువీధి సేవ నిర్వహించారు. స్వర్ణ సూర్యప్రభ వాహనంపై కూర్చుండబెట్టి తిరువీధులలో ఊరేగించారు. భక్తులందరిపై వసంతాన్ని చల్లుతూ వసంత ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో రేపు చివరి రోజు స్వామివారికి పవిత్ర గోదావరి నదిలో చక్రతీర్థం వేడుక జరగనుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా నిలిపివేసిన నిత్య కల్యాణాలు ఈనెల 3 నుంచి పునః ప్రారంభం కానున్నాయి.
Comments