Minister Ponnam Launches Breakfast Scheme : ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ కార్యక్రమానికి సర్కారు శ్రీకారం చుట్టింది. రాజ్ భవన్ పాఠశాలలో హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ 'సీఎం బ్రేక్ ఫాస్ట్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని మంత్రి పొన్నం, ఎంపీ అనిల్ కుమార్, దానం నాగేందర్ అల్పాహారం తీసుకున్నారు. అల్పాహార పథకంలో భాగంగా తొలిరోజు పాలు, ఉడకబెట్టిన గుడ్డు, పూరి, రాగి ఇడ్లీని అందించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ చిన్నారులకు అల్పాహారం తినిపించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ చిన్నారుల్లో పోషకాహార లోపం తగ్గించటంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెంచేందుకు ఈ పథకాన్ని ప్రారంభించినట్లుగా వివరించారు. ఈ పథకంతో తెలంగాణ రాష్ట్రంలో 1.44 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. అల్పాహార పథకం కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.540 కోట్లు ఖర్చు చేస్తుందని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
Comments