Dance Master Pandu Health Bulletin Release: రోడ్డు ప్రమాదంలో గాయపడిన డ్యాన్స్ మాస్టర్ పండుకు విశాఖ మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ప్రమాదంలో పండు రెండు కాళ్లు విరిగాయని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. పూర్తిస్థాయిలో కోలుకునేందుకు 4 నుంచి 6 నెలల సమయం పడుతుందని చెబుతున్నారు. డాన్స్ మాస్టర్ పండు ఆరోగ్య పరిస్థితిపై మెడికవర్ హాస్పిటల్ ఆర్థో హెడ్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం. "నిన్న అర్ధరాత్రి రెండు గంటల సమయంలో పండు మాస్టర్ను ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. అప్పుడు పండుకి వైద్యపరీక్షలను నిర్వహించిన అనంతరం ఎడమ కాలి తుంటి జారిందని తెలిసింది. మోకాళ్ల కింది భాగంలో రెండు కాళ్లు విరిగాయి. దాంతో అత్యవసరంగా తుంటి ఎముకకు చికిత్సను అందించాం. ఈరోజు పండు మాస్టర్ రెండు కాళ్లకు ఆపరేషన్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. పండుకి ప్రాణాపాయం ఏమీ లేదు. అతనికి మరింత మెరుగైన చికిత్సను అందించడానికి అన్ని విధాలా కృషి చేస్తున్నాం". -డాక్టర్ ప్రతాప్ రెడ్డి,మెడికవర్ హాస్పిటల్ ఆర్థో హెడ్ డాక్టర్ అసలేం జరిగిందంటే?: విశాఖ జిల్లా ఆనందపురం మండలంలోని లొడగలవానిపాలెం వద్ద మంగళవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో డ్యాన్స్ మాస్టర్ పండుకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం అనకాపల్లి ప్రాంతానికి చెందిన బాలు రైడర్స్ అనే డాన్స్ గ్రూప్ భీమిలి మండలంలో మంగళవారం రాత్రి ఓ ఈవెంట్ పూర్తి చేసుకుని వస్తుండగా విశాఖ జిల్లా ఆనందపురం మండలం లొడగలవాని పాలెం వద్దకు వచ్చేసరికి కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు వాంతులు కావడంతో వాహనంలో ఉన్న వ్యక్తులు రోడ్డుపైకి దిగారు.ఈ క్రమంలో కోళ్ల లోడ్తో వస్తున్న వాహనం ఒక్కసారిగా వెనక నుంచి కారును ఢీ కొట్టింది. దీంతో కారు వెనకాల భాగంలో నిలబడిన పండు మాస్టర్తో పాటు లిఖిత ప్రియ, హారిక అనే మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మరో కారులో మాస్టర్ పండుని విశాఖ నగరంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు.
Comments