Opening Of Trishul Project In Visakhapatnam At Kailasagiri : పర్యాటకులను ఆకట్టుకునేలా విశాఖలోని కైలాసగిరిపై దాదాపు రూ.3 కోట్లతో చేపట్టిన 'త్రిశూల్ ప్రాజెక్టు'ను మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, విశాఖ ఎంపీ శ్రీభరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విశాఖ నగరాన్ని పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. కైలాసగిరిపై 65 అడుగుల ఎత్తైన త్రిశూలాన్ని నిర్మించినట్లు మంత్రి నారాయణ చెప్పారు. ఢమరుకం 10 అడుగుల ఎత్తు, 18 అడుగుల వెడల్పు ఉందన్నారు. ఈ ఆకృతులను పుణెలో రూపొందించినట్లు తెలిపారు. నగరంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా కనిపించేలా ఎత్తయిన కొండపై నిర్మించడమేగాక త్రిశూలం వెలుగులు విరజిమ్మేలా లోపల ఎస్ఈడీ దీపాలు అమర్చారు. ఈ ప్రాంతంలో పర్యాటకుల కోసం భారీ సెల్ఫీ పాయింట్ను కూడా ఇక్కడ సిద్ధం చేశామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని పర్యాటక ప్రాంతాలను అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, పలువురు ఎమ్మెల్యేలు, VMRDA (విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ) ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Comments