Tractor Catches Fire After Touching Power Lines: పశుగ్రాసంతో వెళ్తున్న ట్రాక్టరు కరెంట్ తీగలు తగిలి భారీ మంటలు రేగాయి. నిమిషాల్లో ట్రాక్టర్ అంత మంటలు వ్యాపించి పశుగ్రాసం అంత కాలి బూడిదయ్యింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఎమ్మిగనూరు పట్టణంలోని శివ కూడలి వద్ద ఈ రోజు భారీ ప్రమాదం తప్పింది. పశుగ్రాసం లోడుతో వెళ్తున్న ఓ ట్రాక్టర్కు ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ట్రాక్టర్పై ఎత్తుగా ఉన్న గడ్డి లోడు పైన వేలాడుతున్న విద్యుత్ తీగలకు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు ట్రాక్టర్ మొత్తానికి వ్యాపించాయి. గమనించిన డ్రైవర్ వెంటనే కిందకు దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది.స్థానికులు మంటలను ఆర్పేందుకు శ్రమించినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో విలువైన పశుగ్రాసం కాలి బూడిదవ్వగా, ట్రాక్టర్ పాక్షికంగా దెబ్బతింది. రద్దీగా ఉండే కూడలిలో ఈ ఘటన జరగడంతో కాసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Comments