Tirumala Salakatla Brahmotsavam 2026 : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మూడో రోజైన ఇవాళ రాత్రి శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ముత్యపుపందిరి వాహనంపై బాలకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నిచ్చెన ఎక్కి వెన్న దొంగిలించే బాలకృష్ణుడి లీలను తలపించే ఈ అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. మాడ వీధుల్లో వైభవంగా సాగిన వాహనసేవలో వివిధ రాష్ట్రాలకు చెందిన కళాబృందాల ప్రదర్శనలు భక్తులను అలరించాయి. పెద్ద సంఖ్యలో భక్తులు మాడ వీధులకు తరలివచ్చి స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించి భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఈ వాహనసేవలో తిరుమల పెద్దజీయర్స్వామి, చిన్నజీయర్స్వామి, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.జ్యోతిషశాస్త్రంలో ముత్యాలు చంద్రునికి ప్రతీకగా పేర్కొన్నారు. శ్రీకృష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్లు పురాణాల్లో ప్రస్తావన ఉంది. ఆదిశేషుని పడగలను ముత్యాల పందిరిగా స్వీకరించి శ్రీనివాసుడు భక్తులకు దర్శనమివ్వడం ఈ వాహనసేవ ప్రత్యేకత. చల్లని ముత్యాల పందిరి కింద కొలువైన శ్రీవారిని దర్శించుకోవడం వల్ల తాపత్రయాలు తొలగి, భక్తుల జీవితాల్లో సుఖశాంతులు, సకల శుభాలు చేకూరుతాయని పురాణ ప్రశస్తి.
Comments