Lashkar Bonalu Secundrabad 2026 : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాల జాతర తెల్లవారుజాము నుంచే ప్రారంభమయ్యింది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఆలయ పూజారులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ముందుగా మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని, ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, బంగారు బోనం సమర్పించారు. అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రజలపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. సమృద్ధిగా వర్షాలు పడాలని వేడుకున్నట్లు వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయానికి విచ్చేసిన సీఎంకు నిర్వాహకులు మేళతాళాలతో ఘనస్వాగతం పలికారు. సీఎంతో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్లు ఉన్నారు. కొండా సురేఖ అమ్మవారికి బోనం సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆరు క్యూలైన్లను ఏర్పాటు చేసి అమ్మవారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నారు. బోనంతో వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.
Comments