Private Bus Catches Fire At Tada In Tirupati District: తిరుపతి జిల్లా తడ జాతీయ రహదారిపై శ్రీసిటీ కార్మికులు ప్రయాణిస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. శ్రీసిటీలోని ఓ పరిశ్రమ నుంచి సూళ్లూరుపేటకు కార్మికులతో వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కార్మికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అనంతరం మంటలను ప్రాథమిక దశలోనే డ్రైవర్ గుర్తించడంతో అదృష్టవశాత్తు ఎవరికీ ఏ విధమైన ప్రాణనష్టం సంభవించలేదు. ఆ తర్వాత బస్సులో ప్రయాణిస్తున్న కార్మికులను అప్రమత్తం చేయడంతో పెనుప్రమాదం తప్పింది. కార్మికులు బస్సు దిగిన తర్వాత మంటలు తీవ్రరూపం దాల్చడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ క్రమంలో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్ధలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు శాయశక్తులా యత్నించారు. షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించి ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. సకాలంలో డ్రైవర్ అప్రమత్తం కావడంతో అగ్నిప్రమాదం నుంచి ప్రయాణికులు బయటపడ్డారు.
Comments