Minority Affairs Govt Advisor MA Sharif on YSRCP: హజ్ కమిటీపై సాక్షి పత్రిక అబద్ధపు ప్రచారం చేస్తోందని ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల సలహాదారు ఎంఏ షరీఫ్ అన్నారు. చిన్న టెక్నికల్ అంశాన్ని భూతద్దంలో చూపి వైఎస్సార్సీపీ రాజకీయం చేస్తుందని దుయ్యబట్టారు. హజ్ కమిటీ పవిత్రతను దెబ్బతీసేలా అసత్య కథనాలు ప్రచురించడం నీచమని మండిపడ్డారు. ముస్లింల మనోభావాలతో ఆడుకోవడం వైఎస్సార్సీపీకి పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో 11 అంతస్తుల హజ్ హౌస్ కట్టిన ఘనత చంద్రబాబుదేనని కొనియడారు. నాడు కడపలో నిర్మించిన హజ్ హౌస్ను వైఎస్సార్సీపీ ప్రభుత్వం కోవిడ్ సెంటర్గా మార్చి నిర్వీర్యం చేసిందని దుయ్యబట్టారు. హజ్ యాత్రికుల కోసం దాచిన రూ.23 కోట్లను వైఎస్సార్సీపీ దారి మళ్లించిందన్నారు. దుల్హన్, విదేశీ విద్య వంటి ముస్లిం సంక్షేమ పథకాలను గత ప్రభుత్వం తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. ముస్లింల సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే బురదజల్లడం మానేసి సూచనలు చేయాలని హితవుపలికారు. మైనారిటీల అభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎటువంటి పొరపాట్లనైనా సరిదిద్దుతామని తేల్చిచెప్పారు.
Comments