Fire Accident In Bus At Vijayawada : విజయవాడ నగరంలోని బస్టాండ్ వద్ద సోమవారం అర్థరాత్రి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. రావులపాలెం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ నాన్-ఏసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన అర్ధరాత్రి సుమారు 12:15 గంటల సమయంలో జరిగింది. మంటలు చెలరేగిన సమయంలో బస్సులో 33 మంది ప్రయాణికులతోపాటు ఇద్దరు సిబ్బంది ఉన్నారు. బస్సుకు సంబంధించిన బ్యాటరీ టెర్మినల్స్ వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు బస్సు నుంచి దిగారు. వెంటనే స్థానిక అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో 35 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అర్థరాత్రి అవ్వడంతో రోడ్డుపై వాహనాల రాకపోకలు అంతగా లేవు. ఈలోగా అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించారు.
Comments