Medical Student Suspicious Death in Vijayawada: విజయవాడ నగరంలోని ప్రభుత్వ వైద్యకళాశాలలో విద్యార్థిని అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. అనస్తీషియా విభాగంలో పీజీ ఫైనలియర్ చదువుతున్న దీపిక మృతి చెందినట్లు సిబ్బంది గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆస్పత్రి సూపరింటెండెంట్తో కలిసి సీసీ కెమెరాలను పరిశీలించారు. విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు దీపిక విధులు నిర్వర్తించాల్సి ఉంది. ఆకలిగా ఉందంటూ తోటి విద్యార్థినితో ఆమె ఆహారం తెప్పించుకున్నట్లు సమాచారం.ఆ తర్వాత ఒంట్లో కాస్త ఇబ్బందిగా ఉందని చెప్పడంతో మరో వైద్య విద్యార్థిని ఇంజక్షన్ చేశారు. రాత్రి 11.30 గంటల సమయంలో ఆపరేషన్ గదిలో బల్లపై పడిపోయిన స్థితిలో దీపిక ఉన్నారు. అనంతరం మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటనపై వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ విచారం వ్యక్తం చేశారు. మృతురాలి తండ్రితో ఆయన మాట్లాడారు. కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. దీపిక మృతికి గల కారణాలు తెలుసుకోవాలని సీపీ రాజశేఖర్బాబును మంత్రి ఆదేశించారు.
Comments