SBI Staff Housing Amaravati : రాజధాని అమరావతిలో ఎస్బీఐ సిబ్బంది నివాస గృహ సముదాయం నిర్మాణానికి ముందడుగు పడింది. ఐనవోలు పరిధిలో 2.05 ఎకరాల్లో రూ.214 కోట్లతో నిర్మించనున్న ఈ సముదాయానికి ఎస్బీఐ, ఏపీ సీఆర్డీఏ మధ్య భూ ఒప్పందం పూర్తయింది. 4.46 లక్షల చదరపు అడుగుల బిల్ట్అప్ ఏరియాతో నిర్మాణం చేపట్టి 2027 జూన్లో పనులు ప్రారంభించి, 2028లోపు పూర్తి చేయాలని ఎస్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. అమరావతిని జాతీయ స్థాయి ఆర్థిక, పరిపాలనా కేంద్రంగా బలోపేతం చేసే దిశలో ఈ ఒప్పందం కీలక ముందడుగుగా మారనుందని అధికారులు వెల్లడించారు. మరోవైపు, రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వోద్యోగులకు అత్యాధునిక వసతులతో నిర్మించనున్న గృహ సముదాయం నిర్మాణానికి టెండర్ ప్రక్రియ ప్రారంభమైందని కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇటీవల ఓ ప్రకటనలో తెలిపారు. ఉద్యోగులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యంతో కేంద్రం ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు చేపట్టిందని తెలిపారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,083 కోట్లు కాగా, నిర్మాణ పనుల్ని మొత్తం 28 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించారని తెలిపారు.
Comments