Garuda Vahana Seva Arrangements 2026 : కలియుగ వైకుంఠనాథుడి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. ఈరోజు సాయంత్రం గరుడ వాహన సేవ జరగనుంది. పురాణాల ప్రకారం గరుడ వాహనంపై మలయప్ప స్వామి ఊరేగింపును వీక్షించేందుకు ముక్కోటి దేవతలు సైతం వస్తారని నమ్మకం. దీంతో ఈ సేవను వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. నాలుగు మాడ వీధుల్లోని సుమారు 190 గ్యాలరీలు భక్తులతో నిండిపోయాయి. దాదాపు 3 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాతో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా 19 రకాల ఆహార పదార్థాలు పంపిణీ చేస్తోంది. 3 లక్షల అర లీటర్ వాటర్ బాటిళ్లు, లక్ష ఒక లీటర్ వాటర్ బాటిళ్లను మాడ వీధుల్లో అందుబాటులో ఉంచింది. భక్తుల రద్దీ దృష్ట్యా తెల్లవారుజామున 3 నుంచే పుష్కరిణిలో పుణ్యస్నానాలకు అనుమతిచ్చింది. రేపు (ఆదివారం) ఉదయం ఐదు గంటల వరకు కనుమ రహదారుల్లో ద్విచక్రవాహనాల రాకపోకలపై నిషేధం విధించింది. తిరుపతిలోని ఐదు ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్కు ఏర్పాట్లు చేసింది. తిరుపతి-తిరుమల మధ్య 3100 ఆర్టీసీ బస్సు సేవలు నడపనున్నారు. మాఢ వీధులు, తిరుమల ఇన్నర్ రింగ్రోడ్లో 37 ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. భక్తుల సౌలభ్యం దృష్ట్యా తిరుపతి నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టడంతో పాటు ఘాట్ రోడ్లలో కీలక ఆంక్షలు విధించారు. వాహనాల పార్కింగ్కు ప్రత్యేక ప్రాంతాన్ని కేటాయించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా 5300 మంది పోలీసు సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఎప్పటికప్పుడు టీటీడీ భక్తులకు తగు సూచనలు చేస్తోంది.
Comments