Seed Embedded Clay Ganesh : పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండలం పన్నూరులోని రామగిరి ఖిల్లా ప్రభుత్వ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు విత్తనాలతో మట్టి వినాయకుడిని తయారు చేశారు. మట్టితో విగ్రహాలు తయారు చేసేటప్పుడు వివిధ రకాల కూరగాయల విత్తనాలను జోడించి విత్తన వినాయకులను రూపొందించారు. విగ్రహాల నిమజ్జనం అనంతరం మట్టిలోని విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా ఎదుగుతాయనే ఆలోచనతో ఈ విగ్రహాలను తయారు చేసినట్లు తెలిపారు.ప్రతి ఇంటికి ఉద్యాన మొక్కలను పరిచయం చేయడంతో పాటు ఇంటి తోటల పెంపకాన్ని ప్రోత్సహించాలన్నది ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల లక్ష్యం. వినాయకునితో పాటు మొక్కను కూడా ఇంటికి తీసుకెళ్లండి అనే సందేశాన్ని వారు చెబుతున్నారు. పూజతో పాటుగా పర్యావరణ పరిరక్షణకు దోహదపడే వినూత్న ఆలోచన అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక్కడ ప్రతి ఏటా వినాయక చవితి సందర్భంగా భారీ సంఖ్యలో గణపతి విగ్రహాలను ప్రతిష్టించి నిమజ్జనం చేయడం ఆనవాయితీ. పర్యావరణానికి హాని కలిగించని మట్టి గణపతిని ప్రతిష్టించి పూజలు చేయడం ద్వారా పర్యావరణాన్ని రక్షించిన వారం అవుతామని విద్యార్థులు చెబుతున్నారు.
Comments