Karnataka Farmers Block Tungabhadra Canal : తుంగభద్ర జలాశయం ఎల్ఎల్సీ కాలువ నీటిని కర్ణాటక రైతులు అడ్డుకున్నారు. తమ వాటా కింద తుంగభద్ర నుంచి కర్ణాటక 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేసింది. ఈ కాలువ 155వ కిలోమీటర్ వద్ద కర్నూలు జిల్లా హాలహర్వి మండలంలో ఏపీలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత మళ్లీ కర్ణాటక మీదుగా ఏపీ సరిహద్దు గ్రామాలకు ఈ నీరు చేరుకుంటుంది. అయితే, డ్యామ్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి. దీంతో తమ పంటలకు నీరు సరిపోదని కర్ణాటక రైతులు ఆందోళన చెందారు. భారీగా చేరుకుని 155వ కిలోమీటర్ వద్ద ఇసుక బస్తాలు అడ్డుపెట్టారు. నీటిని ఏపీ వైపు రాకుండా తమ ప్రాంతాలకు మళ్లించుకున్నారు.ఏపీకి ఇంకా నీటి వాటా విడుదల చేయలేదన్న కారణంతోనే కర్ణాటక రైతులు ఈ చర్యకు పాల్పడ్డారు. ఏపీ వాటా నీరు రావాలంటే కర్నూలు జిల్లా కలెక్టర్ టీబీ డ్యామ్ అధికారులకు ఇండెంట్ పెట్టాలి. కలెక్టర్ లేఖ రాస్తే ఏపీకి మరో 600 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుంది. కానీ, నీటి విడుదలకు సంబంధించి జిల్లా కలెక్టర్ అధికారులతో ఇంకా సమావేశం నిర్వహించలేదు. దీంతో ఏపీ వాటా నీటిని డ్యామ్ అధికారులు ఇంకా విడుదల చేయలేదు. ఈ జాప్యాన్ని ఆసరాగా చేసుకునే కర్ణాటక రైతులు కాలువకు ఇలా అడ్డుకట్ట వేశారు.
Comments