Statues With Iron Scrap in Capital Amaravati : రాజధాని అమరావతి పునః ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రజలు రాజధాని ప్రాంతానికి చేరుకుంటున్నారు. సభావేదిక వద్ద ఏర్పాటు చేసిన శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బుద్ధుడు, కాలచక్రం, ఎన్టీఆర్, ప్రధాని నరేంద్రమోదీ విగ్రహాలతో పాటు మేక్ ఇన్ ఇండియా లోగో ఆకట్టుకుంటున్నాయి. దీంతో పాటు ‘అమరావతి’ అక్షరాలను రూపొందించారు. వీటిని ఐరన్ స్క్రాప్తో శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు తీర్చిదిద్దారు.విధ్వంసం నుంచి వికాసం వైపు పయనించేందుకు ప్రజా రాజధాని అమరావతి సిద్ధమైంది. పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి సగర్వంగా ముస్తాబైంది. అమరావతి పునఃప్రారంభం పేరిట ప్రభుత్వం భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తుండగా రాజధానిలోని వెలగపూడిలో దాదాపు 276 ఎకరాల్లో అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా ఈ సభకు హాజరై రాజధాని పనులు పునః ప్రారంభించనున్నారు. ఈ పనుల ప్రారంభానికి ప్రతీకగా అమరావతి పైలాన్ ను ఆవిష్కరించనున్నారు. మొత్తంగా రాజధాని పనులు సహా 57,940 కోట్ల రూపాయల మేర ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.