Paintings In Ramagundam Station : పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్ కొత్త హంగులతో కళకళలాడుతోంది. రైల్వే స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయల వ్యయంతో స్టేషన్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. స్టేషన్ లోపల, బయట గోడలపై రంగురంగుల బొమ్మలు ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. దేశ, రాష్ట్ర, ప్రాంతీయ ప్రగతిని ఉట్టిపడే విధంగా రంగు హంగులతో కనిపిస్తోంది. పచ్చని ప్రకృతి మధ్య రైల్వే స్టేషన్ ముఖద్వారం, లోపలికి వెళ్లిన వెంటనే విశాలమైన స్టేషన్ ప్రాంగణం కనిపిస్తోంది. ఇక ఎటు చూసినా ప్రకృతి అందాలు, స్థానికంగా ఉన్న సింగరేణి బొగ్గు గనులు, ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమ కంటికి ఇంపుగా కనిపిస్తుంది. స్టేషన్ బయట ప్రహరీ గోడపై వందేభారత్ రైలు త్రీడీ చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. నిజమైన రైలులా ఉండడంతో విద్యార్థులు పట్టాలు దాటుతున్నట్టు ఊహించుకుంటూ సెల్ఫీలకు ఫోజులిస్తున్నారు. రైల్వే సిబ్బంది ప్రయాణికుల్లో చైతన్యం కోసం 'ట్రాక్పై నడవకండి, పరిసరాలను శుభ్రంగా ఉంచండి, నీటిని వృధా చేయకండి' అనే సందేశాలతో కూడిన పెయింటింగ్స్ ప్రయాణికులు ఆలోచింపజేస్తున్నాయి.
Comments