To Get To School Cross Stream : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కూతవేటు దూరంలో ఉన్న పాఠశాలకు విద్యార్థులు రావాలంటే వాగు దాటాల్సిన దుస్థితి నెలకొంది. చుంచుపల్లి మండలం పెనగడప పంచాయతీలోని మూలుగు గూడెం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల పరిస్థితి ఇది. పాలవాగుగూడెం గ్రామానికి చెందిన 33 మంది విద్యార్థులు మూలుగుగూడెం ప్రాథమిక పాఠశాలకు వస్తుంటారు. దారి మధ్యలో ఓ వాగును దాటాల్సిన పరిస్థితి. మిగిలిన రోజుల్లో కొంత పర్వాలేదు అనిపించిన వర్షాకాలంలో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటం వల్ల బడికి రావడం కష్టంగా ఉంటుంది. తల్లిదండ్రులు వాగు వద్ద పాఠశాల ఉపాధ్యాయుడు రాముకు పిల్లలను అప్పగిస్తారు. ఆయన పిల్లలను జాగ్రత్తగా వాగు దాటిస్తారు. తిరిగి పాఠశాల పూర్తయిన వెంటనే ఉపాధ్యాయుడు మరోసారి విద్యార్థులను వాగు దాటించి వారి వారి తల్లిదండ్రులకు అప్పగిస్తారు. వారికి ఇది నిత్యకృత్యం. ఈ వాగుపై చిన్నపాటి వంతెనను నిర్మించి విద్యార్థుల కష్టాలను తీర్చాల్సిందిగా గ్రామస్థులు కోరుతున్నారు.
Comments