Cement Fly Ash Tanker Hits Private Engineering College Bus in YSR Distrcit: కడప జిల్లాలోని 67వ జాతీయ రహదారిపై సిమెంట్ ఫ్లై యాష్తో వెళ్తున్న ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. మైదుకూరు మండలం వరదాయపల్లె వద్ద ఈ ప్రమాదం జరిగింది. బద్వేలు వైపు నుంచి మైదుకూరు వైపునకు వస్తున్న సిమెంట్ ట్యాంకర్ ముందు వెళ్తున్న కడప ఇంజనీరింగ్ కళాశాల బస్సును ఢీకొట్టి బోల్తాపడింది. కళాశాల బస్సు విద్యుత్ స్తంభాన్ని గుద్ది రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ఘటనలో ఒక కారు స్వల్పంగా ధ్వంసమైంది. ప్రమాదంలో బస్సు డ్రైవర్తోపాటు, ట్యాంకర్ డ్రైవర్కు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కళాశాల బస్సులో నలుగురు విద్యార్థులు ఉన్నారు. ఎవరికీ గాయాలు కాలేదని కళాశాల సిబ్బంది తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ ప్లాజా వద్ద ఈనెల 11న ఇదే తరహా ట్యాంకర్ ఆగి ఉన్న కారుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో హైకోర్టు లాయర్ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు అదే తరహా ట్యాంకర్ ప్రమాదానికి కారణం అవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Comments