9 Feet Plant Ganesh in East Godavari : వినాయక ప్రతిమలు అంటే మట్టితోనో, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను ఉపయోగించో చేస్తారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం పొట్టిలంక గ్రామానికి చెందిన మురుగన్ నర్సరీ రైతు అందుకు భిన్నంగా ఆలోచించారు. అత్యంత అరుదైన జీవం గల వృక్షంతో గణపతిని రూపొందించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 9 అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పుతో రెండేళ్లు శ్రమించి ఈ వృక్ష గణపతిని తయారు చేసినట్లు నిర్వాహకుడు దూలం ధనరాజ్ తెలిపారు. ముందుగా ఇనుప తీగలతో గణపతి ఆకారాన్ని రూపొందించి, దానికి నాలుగు మాల్పీజియా జాతి మొక్కలను అమర్చినట్లు ధనరాజ్ చెప్పారు. ఆ మొక్కలు గణపతి ఆకారాన్ని అనుసరించి పెరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నానని వివరించారు. కొమ్మలను అవసరమైన విధంగా మలుస్తూ, కత్తిరిస్తూ రెండేళ్ల పాటు చేసిన కృషికి ఇప్పుడు ఫలితం దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ వృక్ష గణపతి ప్రతిమను విక్రయించేందుకు తయారు చేయలేదని చెప్పారు. సనాతన ధర్మరక్షణకు ఎంతో పాటుపడుతున్న తన అభిమాన నేత డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనుమతిస్తే పార్టీ కేంద్ర కార్యాలయంలో కానీ, పవన్ ఫామ్హౌస్లో కానీ పెట్టుకునేందుకు ఇస్తానని ధనరాజ్ చెప్పారు.
Comments