Rain Effect In Paleru Vagu : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ వ్యాప్తంగా వర్షం దంచి కొట్టింది. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురవడంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దంతాలపల్లి మండలంలో ఏకంగా 90.8 మీ.మీ వర్షపాతం నమోదైంది. దీంతో గ్రామాలన్నీ తడిసి ముద్దయ్యాయి. భారీ వర్షం కారణంగా మండలంలోని ప్రధాన సాగునీటి వనరైన పాలేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాగుపై నిర్మించిన చెక్ డ్యాములన్నీ నిండుకుండలా మారి వరద నీరంతా దిగువకు పరవళ్లు తొక్కుతోంది. దీంతో దంతాలపల్లి-పెద్దముప్పారం గ్రామాల మధ్యలో పాలేరు వాగుపై ఉన్న లో లెవెల్ వంతెన పైనుంచి పాలేరు వరద ప్రవహిస్తోంది. దీంతో గ్రామానికి రాకపోకలు నిలిచి పోయాయి. రామవరం శివారులో చెక్ డ్యామ్ పైనుంచి ప్రమాదకర స్థితిలో వాగు ప్రవహిస్తోంది. దీంతో వ్యవసాయ భూములకు వెళ్లే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మిగతా గ్రామాల్లోని చెరువుల్లోకి వర్షపు వరద నీరు చేరుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments