New road constructed in Bandikayalamotu : కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో 50 ఏళ్లుగా సరైన రహదారి లేక ఇబ్బందులు పడుతున్న బాపట్ల జిల్లా రేపల్లె మండలంలోని బండికాయలమోటు గ్రామానికి మోక్షం కలిగింది. మారుమూల గ్రామం కావడంతో దశాబ్దాల కాలం నుంచి రాకపోకలు చేసేందుకు రోడ్డు మార్గం లేదు. పిల్లలు చదువుకోవాలన్న, ఆరోగ్య సమస్యలు వస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లేందుకు, ఎన్నో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఉండేవి. చిన్న పాటి చినుకు పడితే చాలు గ్రామానికి వచ్చే మార్గం పూర్తిగా బురద మయంగా మారి రాకపోకలు కత్తిమీద సాములా మారేది. సరైన రోడ్డు వసతి లేక ఎంతో మంది గ్రామాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇలా సుమారు 50 ఏళ్ల నుంచి రోడ్డు మార్గం లేక ఇక తమ గ్రామానికి పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణం జరగదు అనుకుంటున్న గ్రామస్థుల కలను కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. మంత్రి అనగాని సత్యప్రసాద్ చొరవతో తుమ్మల గ్రామం నుంచి బండికాయలమోటు గ్రామానికి సుమారు రూ.2 కోట్లతో నూతన సీసీ, బీటి రోడ్డును నిర్మించారు. దీంతో దశాబ్దాల నిరీక్షణ ఇప్పటికి నెరవేరిందని గ్రామస్థులు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. రోడ్డు నిర్మాణంతో తమ గ్రామానికి కొత్త రూపురేఖలు వచ్చాయని, తాము గతంలో పడిన ఇబ్బందులు అన్ని తొలగిపోయాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Comments