Nara Bhuvaneswari At Kuppam : ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్టీ నారా భువనేశ్వరి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఇవాళ రెండో రోజు విస్తృతంగా పర్యటించారు. కుప్పం ప్రభుత్వాస్పత్రిలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్, రక్తదాన శిబిరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్యాన్సర్ మహమ్మారిపై ప్రజలు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ముందస్తు జాగ్రత్తలతో క్యాన్సర్ ముప్పు నుంచి బయట పడవచ్చని అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కూడా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అనంతరం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహిస్తున్న తిరుపతి స్విమ్స్ వైద్యులను అభినందించారు. గుడిపల్లి మండలంలోని అగరం, యమగానిపల్లె గ్రామాల్లో మహిళలతో మాట్లాడారు. పీఈఎస్ వైద్య కళాశాలలో నిర్వహించిన లిటిల్ ఛాంప్స్ రైజ్ అండ్ షైన్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. కుప్పం అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారని భువనేశ్వరి అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు.