In a new twist to the Call Detail Records(CDR) case, Actress Kangana Ranaut and Jackie Shroff’s wife Ayesha Shroff’s names have come up in the investigation of the case by Thane Cime branch.
బాలీవుడ్ చిత్ర పరిశ్రమను సీడీఆర్(కాల్ డేటా రికార్డ్స్) స్కామ్ కుదిపేస్తోంది. తాజాగా ఈ కేసులో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. హీరోయిన్ కంగనా రనౌత్, ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ భార్య ఆయేషా ష్రాఫ్ పేర్లు తెరపైకి వచ్చాయి.
బాలీవుడ్ నటుడు నవాజుద్దిన్ సిద్ధిఖి తన భార్యపై అనుమానంతో రిజ్వాన్ సిద్ధిఖి అనే లాయర్ చేత కాల్ డేటా రికార్డులు సంపాదించాడన్న ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును విచారిస్తున్న థానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రిజ్వాన్ సిద్ధిఖిని అదుపులోకి తీసుకుని విచారించగా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.
థానే పోలీస్ క్రైమ్ బ్రాంచ్ డిసీపీ అభిషేక్ త్రిముఖి చెప్పిన వివరాల ప్రకారం..... పోలీసుల అదుపులో ఉన్న లాయర్ రిజ్వాన్ విచారణలో యాక్టర్ సాహిల్ ఖాన్ కాల్ డీటేల్స్ ఆయేషా ష్రాఫ్ ద్వారా సంపాదించాడని కనుగొన్నామని తెలిపారు. గతంలో ఆయేషా-సాహిల్ ఖాన్ మధ్య ఓ వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆమె కాల్ డేటా వివరాలు ఇచ్చినట్లు అనుమానిస్తున్నారు.
ఈ కేసులో కంగనా రనౌత్ పేరు కూడా తెరపైకి వచ్చింది. హృతిక్ నంబర్ను కంగన రిజ్వాన్కి ఇచ్చి కాల్ డేటా రికార్డులు అడిగినట్లు సమాచారం. ఈ మేరకు రిజ్వాన్ ఫోన్లో కంగనా నుండి ఓ మెసేజ్ కూడా వచ్చిందని, అందులో హృతిక్ పేరు, ఫోన్ నెంబర్ ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. గతేడాది కంగనా-హృతిక్ మధ్య గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపత్యంలో కంగనా అతడి కాల్ డేటా సేకరించడానికి ప్రయత్నించినట్లు అనుమానిస్తున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో కంగనకు, అయేషాకు నోటీసులు జారీ చేసినట్లు థానే క్రైం బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్ అభిషేక్ త్రిముఖి తెలిపారు.
సీడీఆర్ స్కామ్లో కంగనా పేరు రావడంపై ఆమె సోదరి రంగోళి స్పందించారు. తాము ఎలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడలేదని, గతంలో హృతిక్ విషయంలో కంగనకు నోటీసులు వచ్చినప్పుడు ఆధారాల కోసం వివరాలు ఇచ్చామని, అంతకుమించి ఏమీ లేదన్నారు.
Comments