Tirumala Brahmotsavam 2026 : తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఉదయం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మలయప్ప స్వామి వారు కోదండ రాముడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తనకు పరమ భక్తుడైన ఆంజనేయుడిపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో విహరించారు. హనుమంత వాహనాన్ని అధిరోహించిన స్వామివారిని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. ఈ వాహన సేవ ముందు గజరాజులు, అశ్వాలు, గోవులు ఎంతో ఠీవిగా నడిచాయి. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి విచ్చేసిన కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మాడ వీధుల్లోని గ్యాలరీల్లో కిక్కిరిసిన భక్తులు శ్రీవారికి కర్పూర హారతులు సమర్పించారు. ఇదిలా ఉండగా సాయంత్రం వేళలో కూడా మరో విశేష కార్యక్రమం జరిగింది. సాయంత్రం 4 గంటలకు మలయప్ప స్వామి వారు స్వర్ణ రథంపై తిరుమాడ వీధుల్లో ఊరేగారు. బంగారు కాంతులీనే ఈ రథంపై కొలువుదీరి భక్తులకు స్వామి అభయ ప్రదానం చేశారు.
Comments