Pawan Poojas at Guruvayur Temple : ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కేరళంలోని త్రిస్పూర్ జిల్లాలో ఉన్న గురువాయూర్ శ్రీ బాలకృష్ణుడిని దర్శించుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున ఆలయానికి వెళ్లిన ఆయన అత్యంత పవిత్ర సేవగా భావించే నిర్మాల్య దర్శనంలో పాల్గొన్నారు. దాదాపు 30 నిమిషాల పాటు ఈ విశిష్ట సేవలో పాల్గొని తరించారు. గర్భాలయంలో మూల విరాట్టుకు నిర్వహించే తైలాభిషేకం, వాకచార్థు, శంఖాభిషేకంతో పాటు ప్రత్యేక కైంకర్యాలను భక్తిశ్రద్ధలతో తిలకించారు. ఈ సందర్భంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత వినాయకుడిని దర్శించుకున్న పవన్, ఆలయ ఆచారాలను అనుసరిస్తూ గుడి వెనుక భాగంలో సాష్టాంగ నమస్కారం చేశారు. దేవాలయ ప్రాంగణంలో ఉన్న ఆంజనేయస్వామి, అనంత పద్మనాభస్వామి, భగవతి అమ్మవార్లను దర్శించుకున్నారు. గురువాయూర్ ఆలయ ప్రదక్షిణలో అయ్యప్పస్వామికి ప్రత్యే పూజలు నిర్వహించారు. అనంతరం గురువాయూర్ మేల్ శాంతితో పాటు ఇతర ప్రధాన అర్చకులు పవన్ కల్యాణ్ను ఆశీర్వదించి స్వామివారి కళభం, ప్రసాదాలను అందజేశారు.
Comments