Poleramma Bonalu Amanigudipadu Markapuram District : సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో అందరూ సంతోషంగా ఉండాలని కాంక్షిస్తూ మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం మండలం అమానిగుడిపాడులో కొలువుదీరిన పోలేరమ్మకు గ్రామస్థులు బోనాలు సమర్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. పొంగళ్లు నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించారు. పోలేరమ్మ తల్లి వాహనం అయిన బొల్లావును గ్రామ వీధుల్లో ఉత్సాహంగా ఊరేగించారు. ఈ కార్యక్రమ కోసం గ్రామస్థులంతా ఐక్యమై అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఆధునిక వాతావరణ శాస్త్రం ప్రకారం వర్షాలు కురవడానికి సముద్రాల నుంచి నీటి ఆవిరి, గాలుల దిశ, ఉష్ణోగ్రతలు, తేమ, వాయు పీడనం వంటి అనేక ప్రకృతి కారకాలు కలిసి పనిచేస్తాయి, కానీ బోనాలు సమర్పిస్తే, మొక్కులు చెల్లిస్తే వర్షాలు కురవవని మేధావులు అంటున్నారు. బోనాలు సమర్పించడం అనేది శాస్త్రీయంగా వర్షాలు కురిపించే ప్రక్రియ కాదు, కానీ ఇది ప్రకృతిని గౌరవిస్తూ, సకాలంలో వర్షాలు కురవాలని, సమాజం సుభిక్షంగా ఉండాలని కోరుకునే ఒక గొప్ప ఆధ్యాత్మిక నమ్మకం, సంస్కృతి అని పండితులు అంటున్నారు.
Comments