Bhadrachalam Temple Ekadashi Pooja : తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంతాలన్నీ రద్దీగా మారాయి. తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడితో క్యూలైన్లన్నీ నిండిపోయాయి. బేడ మండపంలో జరిగే నిత్య కళ్యాణ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆషాడ మాసం తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారి ఆలయంలో శ్రీరామాత్మక వరుణ యాగాన్ని నిర్వహిస్తున్నారు. వరుణ యాగాన్ని నిర్వహించడం ద్వారా దేశవ్యాప్తంగా వర్షాలు బాగా కురిసి, పాడిపంటలు పండి, దేశాభివృద్ధి జరుగుతుందని ఆకాంక్షిస్తున్నారు. శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఉత్తర్వుల మేరకు శ్రీరామాత్మక వరుణ యాగాన్ని నిర్వహిస్తున్నాం. ఈ యాగాన్ని పూర్వం ప్రధాన అర్చకులు నిర్వహించారు. అపుడు వర్షాలు సమృద్ధిగా పడ్డాయి. వరుణ యాగం చేయడం వల్ల మన రాష్ట్రంలో కాక ఇతర రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తాయి. దీనివల్ల పాడి పంటలు సుభిక్షంగా పండుతాయి - కిషోర్, ఆలయ అర్చకులు భద్రాచలం
Comments