JSW Steel Plant Jammalamadugu : రాయలసీమ వాసుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. జమ్మలమడుగు సమీపంలోని సున్నపురాళ్లపల్లె వద్ద ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ స్టీల్ ప్లాంట్ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రముఖ సంస్థ జేఎస్డబ్ల్యూ ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఈటీవీ ముఖాముఖిలో కడప కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ప్లాంట్ వివరాలు వెల్లడించారు. మొత్తం 3,500 ఎకరాల్లో ఈ పరిశ్రమను స్థాపిస్తున్నారు. ఏపీఐఐసీ ఇప్పటికే 1,100 ఎకరాలను అప్పగించింది. త్వరలో మిగతా భూసేకరణ పూర్తవుతుంది. జేఎస్డబ్ల్యూ సంస్థ రెండు దశల్లో ఏకంగా రూ.16,350 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనుంది.తొలి దశలో రూ.4,500 కోట్లు వెచ్చించనున్నారు. 10 లక్షల టన్నుల సామర్థ్యంతో 2029 నాటికి పనులు పూర్తి చేస్తారు. ఆ తర్వాత రూ.11,850 కోట్లతో రెండో దశను మొదలుపెడతారు. ఏప్రిల్ 2034 నాటికి దీనిని పూర్తి చేసి, మరో 20 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధిస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా 2,500 మందికి ప్రత్యక్షంగా, మొత్తంగా 5 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
Comments